స్వస్తిక్ న్యూస్,అమరావతి :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు ఎన్నికల వేడి రగులుకోనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన టీడీపీ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ దిశగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

'సర్' ప్రక్రియ పూర్తి కాగానే నగారా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ 'సర్' (SIR) ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సవరించిన ఓటర్ల జాబితా ఆధారంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది.పార్టీ శ్రేణులకు దిశానిర్దేశంటీడీపీ నేతలతో జరిగిన జూమ్ మీటింగ్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మమేకమై ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి అడుగులేయాలని, ప్రజల్లో మంచి గుర్తింపు, సేవా దృక్పథం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. సీఎం చంద్రబాబు ప్రకటనతో పాటు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా స్థానిక ఎన్నికల నిర్వహణపై మరింత స్పష్టతనిచ్చాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం మెండుగా ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
కూటమికి మరో అగ్నిపరీక్ష..ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ కూటమికి మరో అగ్నిపరీక్షగా మారనున్నాయి. ప్రభుత్వ పనితీరుకు, సంక్షేమ పథకాలకు ఈ ఎన్నికలు గీటురాయిగా నిలవనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని అధికార పక్షం భావిస్తుండగా, ఎలాగైనా పట్టు సాధించి తిరిగి పుంజుకోవాలని ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యూహరచన చేస్తోంది.మొత్తం మీద సీఎం చంద్రబాబు ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాబోయే రెండు, మూడు నెలల్లో గ్రామ, పట్టణ స్థాయిల్లో రాజకీయ సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.