స్వస్తిక్ న్యూస్,హైదరాబాద్:- తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య 'అప్పుల' అంశంపై సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం రాజుకుంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ సెగలు రగులుతున్నాయి.
అప్పుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు :- గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, భారీగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి దీటుగా బదులిస్తున్న బీఆర్ఎస్ నేతలు, కేవలం రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే అంతకంటే ఎక్కువ అప్పులు చేశారని, ఈ 'అప్పుల కుప్ప'పై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిసవాల్ విసురుతున్నారు.
హాట్ టాపిక్గా మంత్రి జూపల్లి సవాల్ :- ఈ సవాళ్ల పర్వంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నేతల సవాల్ను స్వీకరిస్తూ, హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు (బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం) స్వయంగా వెళ్లి అప్పుల లెక్కలపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఒక మంత్రి నేరుగా ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికి వెళ్లి చర్చకు సిద్ధపడటం చర్చనీయాంశంగా మారింది. మంత్రి జూపల్లి సవాల్తో తెలంగాణ భవన్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆయన ప్రకటన వెలువడిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వస్తారా? వస్తే అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతుందా? లేదా అది మరో రాజకీయ దుమారానికి దారి తీస్తుందా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతానికి అందరి దృష్టి తెలంగాణ భవన్పైనే కేంద్రీకృతమై ఉంది.