స్వస్తిక్ న్యూస్ ,హైదరాబాద్ :- డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వాహనాన్ని నడిపే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారనే కారణంతో పోలీసులు ఆ వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునే అధికారం లేదని కోర్టు తన తీర్పులో పునరుద్ఘాటించింది. ఒకవేళ డ్రైవర్ మద్యం మత్తులో ఉంటే, వాహనాన్ని నడపడానికి అతడి వెంట ఎవరైనా ఉంటే వారికి అప్పగించాలని, ఒకవేళ ఎవరూ లేకపోతే అతడి బంధువులకు లేదా స్నేహితులకు సమాచారం అందించి వాహనాన్ని తీసుకెళ్లమని సూచించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎవరు రాని పక్షంలో మాత్రమే వాహనాన్ని రక్షణ కోసం సమీప పోలీస్ స్టేషన్కు తరలించవచ్చని పేర్కొంది.
అంతేకాకుండా, వాహన యజమాని సరైన పత్రాలు (RC, ఐడి ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్) సమర్పించిన వెంటనే వాహనాన్ని విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ పోలీసులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, దానిని కోర్టు ధిక్కరణగా పరిగణించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.