స్వస్తిక్ న్యూస్, జీవన శైలి :- మారుతున్న జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితంలో సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చాలామందికి గగనంగా మారింది. పని ఒత్తిడి వల్ల కొందరైతే, టీవీలు, మొబైల్స్ చూస్తూ అలవాటుగా మారి మరికొందరు రాత్రి వేళల్లో చాలా ఆలస్యంగా భోజనం (డిన్నర్) చేస్తున్నారు. అయితే, ఇలా లేటుగా తినే వారికి వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేస్తే అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు.

రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో ప్రతికూల మార్పులు జరుగుతాయని డాక్టర్లు వివరిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం.. రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరంలో 'ఇన్సులిన్ సెన్సిటివిటీ' ఏకంగా 40 శాతం వరకు పడిపోతుందని వైద్యులు హెచ్చరించారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్ లెవెల్స్) అమాంతం పెరుగుతాయి. అంతేకాకుండా, ఆలస్యంగా తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం ఎనర్జీగా (శక్తిగా) మారకుండా, నేరుగా కొవ్వుగా శరీరంలో నిల్వ ఉండిపోతుందని, ఇది ఊబకాయానికి దారితీస్తుందని స్పష్టం చేశారు.డయాబెటిస్, ఫ్యాటీ లివర్ రోగులకు మరింత డేంజర్సాధారణ వ్యక్తులకే ఇది ప్రమాదకరం అయితే, ఇప్పటికే మధుమేహం (డయాబెటిస్), ఫ్యాటీ లివర్ (కాలేయ సమస్యలు) తో బాధపడుతున్న వారికి 'లేట్ డిన్నర్' అనేది మరింత ప్రాణాంతకమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆరోగ్యం కోసం వైద్యుల సూచనలు ఇవే:- ప్రతి ఒక్కరూ రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించడాన్ని అలవాటుగా చేసుకోవాలి. మహా అయితే రాత్రి 9 గంటలు దాటకూడదు. భోజనం చేసిన వెంటనే గటగటా నీళ్లు తాగకూడదు. భోజనానికి, నీరు తాగడానికి మధ్య కనీస వ్యవధి ఉండాలి. రాత్రి తిన్న వెంటనే పడక మీదకు చేరకూడదు. తిన్న తర్వాత కాసేపు ఇంట్లోనే లేదా ఆరుబయట నెమ్మదిగా నడవాలి. ఆ తర్వాతే నీరు తాగి, నిద్రకు ఉపక్రమించాలి.ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని గుర్తుంచుకుని, సరైన సమయానికి భోజనం చేసి అనారోగ్యాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.