స్వస్తిక్ న్యూస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ను మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే నిధులను జూలై 16, 17, 18 తేదీల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శ్రీకాళహస్తిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
నిధుల జమకు ముందు, ఆయా తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ సమావేశాల ద్వారా విద్యావ్యవస్థ బలోపేతం, విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. ఈ సమావేశాల అనంతరం రెండో విడత 'తల్లికి వందనం' నిధులను విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జూలై 15 నుంచి డోర్ టు డోర్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకూ చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. "గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది" అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.