స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- హైదరాబాద్లో జరిగే శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంతంగా, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ శోభాయాత్రకు వేలాది మంది భక్తులు హాజరవుతారని, అందువల్ల ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. శోభాయాత్ర కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించి, యాత్ర సజావుగా సాగేందుకు పాటించాల్సిన నియమాలు, భద్రతా చర్యలపై చర్చించినట్లు వెల్లడించారు.శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, జనసంచారం నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సుమారు 3000 మంది పోలీసులను భద్రత విధుల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్, జేబుదొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ ప్రత్యేకంగా పనిచేస్తాయని చెప్పారు. అదేవిధంగా డ్రోన్ల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తామని, గత సంవత్సరం వాహనాల బ్రేక్డౌన్ కారణంగా యాత్ర ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి అలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శోభాయాత్ర నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా అధికారులు, నిర్వాహకులు కలిసి పనిచేస్తారని చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించి, నియమాలు పాటిస్తే శోభాయాత్ర ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తవుతుందని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.